కరోనా భయం: తెలంగాణలో చనిపోయిన శవాన్ని ఎలా తరలించారంటే?

News Published On : Saturday, March 28, 2020 08:58 AM

ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఇళ్లకే పరిమితం చేసిన కరోనా వైరస్ కారణంగా మానవ సంబంధాలూ ఛిద్రమవుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన కోసరి రాజవ్వ (56) గురువారం సాయంత్రం మృతి చెందింది. బంధువులు, శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేశారు.

అయితే, కరోనా భయంతో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెను కడసారి చూసేందుకు రాలేదు. గ్రామస్థులూ సరేసరి. దీంతో అంత్యక్రియలు నిర్వహించడం ఎలానో తెలియక కుటుంబ సభ్యులు తలలు పట్టుకున్నారు. పాడె మోసేందుకూ ఎవరూ రాకపోవడంతో చివరికి చెత్తను తరలించే రిక్షాపై ఆమె మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.