24 గంటల్లో 950 మందిని బలితీసుకున్న కరోనా..!
కరోనా వైరస్ ప్రభావంతో స్పెయిన్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గడచిన 24 గంటల్లో స్పెయిన్లో కరోనా బారిన పడి 950 మంది మరణించినట్లు అక్కడి వైద్యఆరోగ్య శాఖ లెక్కలు తేల్చింది. దీంతో గురువారం నాటికి ఇప్పటివరకూ స్పెయిన్లో కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య 10 వేలు దాటింది. స్పెయిన్లో కరోనా పాజిటివ్ కేసులు 1,10,000లను దాటాయి. ఇటలీ తర్వాత అత్యధిక కరోనా మరణాలు స్పెయిన్లోనే నమోదు కావడం గమనార్హం.
స్పెయిన్లో ఒక్కరోజులో 15వేల నుంచి 20వేల మంది వరకూ కరోనా టెస్ట్లు చేసేందుకు అవకాశముంది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లోనే 4,175 కరోనా మరణాలు నమోదయ్యాయి. 32,155 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్కడ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. స్పెయిన్లో మూడు వారాల నుంచి లాక్డౌన్ అమలవుతోంది. ఇటలీలో 13వేల మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు.