లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు లైన్ క్లియర్.. మేం ఆపలేమన్న ఎలక్షన్ కమీషన్...!

Entertainment Published On : Saturday, March 16, 2019 06:42 PM

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన తరవాత నుంచి జరిగిన కథను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా చేస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా విడుదల డేట్ రావటం వలన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని నెగటివ్ రోల్‌లో వర్మ చూపించడం వలన ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. దీని ఫలితం ఎన్నికల ప్రభావంపై వుంటుందని టీడీపీ వాళ్లు అనుకుంటున్నారు. ఇందుకోసం ఈ సినిమా విడుదలను ఆపేయాలని టీడీపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ఆపే సీన్ లేదని ఈసీ తేల్చేసింది. 

తాజాగా తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపైస్పందించారు, మార్చి 22న విడుదల కానున్న ఈ సినిమాను అడ్డుకోలేమని స్పష్టం చేశారు. నిజంగానే ఈ సినిమాలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలుంటే రిలీజ్ తర్వాతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక మార్చి 22న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో ప్రకటించారు.