Sushant Death Probe: యూట్యూబర్లు జాగ్రత్త, ఫేక్ వీడియోలపై హీరో అక్షయ్ కుమార్ రూ. 500 కోట్ల పరువు నష్టం దావా

Entertainment Published On : Thursday, December 31, 2020 12:00 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో (Sushant Death Probe) మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి తనను లాగినందుకు మరో బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఓ యూట్యూబర్‌‌కు భారీ షాక్‌ ఇచ్చారు. తనపై అసత్య వార్తాకథనాలను ప్రచారం చేస్తున్న యూట్యూబర్‌పై అక్షయ్‌కుమార్‌ (Bollywood actor Akshay Kumar) రూ.500 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశాడు.ఈ మేరకు బీహార్‌కు చెందిన సిద్ధిఖీ అనే సివిల్‌ ఇంజనీర్‌పై కేసు నమోదైంది. దివంగత బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌‌ కేసుతో (Sushant Singh Rajput Deaths Case) సంబంధం ఉందంటూ తనపై ఫేక్‌ వార్తల్ని ప్రచారం చేశాడని అక్షయ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కాగా, సుశాంత్‌ కేసుతో అక్షయ్‌ని ముడిపెడుతూ సిద్ధిఖీ (YouTuber Rashid Siddiqui) పలు వీడియోలు చేశాడు. సుశాంత్‌ ధోనీ లాంటి పెద్ద సినిమాలు చేయటం అక్షయ్‌కు ఇష్టం లేదని, అక్షయ్..‌ ఆధిత్య ధాక్రే, ముంబై పోలీసులతో పలుమార్లు రహస్య సమావేశాలు జరిపారని ఆరోపిస్తూ ఓ వీడియో రూపొందించారు. సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి కెనడాకు పారిపోవటానికి అక్షయ్‌ సహాయం చేశాడంటూ మరో వీడియో చేశాడు. 

సిద్ధిఖీ ఈ కేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాకరే, ఆయన కుమారుడు అదిత్యా థాకరే పేర్లను కూడా ప్రచారం చేశాడు. వీరితో పాటు ఇతర ప్రముఖులపై కూడా డిజిటల్‌ మీడియా వేదికలను ఉపయోగించుకుని సిద్ధిఖీ ప్రజలను తప్పుదోవ పంటించేలా అసత్యాలను ప్రచారం చేస్తున్నాడు. పలు సందర్భాల్లో తీసిన వీడియోల్లో అక్షయ్‌ కుమార్‌ పేరును ప్రస్తావించాడు. ఎంఎస్‌ ధోని, ది అన్‌టోల్డ్‌ స్టోరీ వంటి చిత్రాలు సుశాంత్‌కు దక్కడం అక్షయ్‌కు ఇష్టం లేదన్నాడు.

ఇలా సుశాంత్‌ ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలు చేయటం ద్వారా సిద్ధిఖీ యూట్యూబ్‌ ఛానల్‌ ఒక్క సారిగా ఫేమస్‌ అయిపోయింది. నాలుగు నెలల కాలంలో దాదాపు 2 లక్షల సబ్‌స్క్రైబర్లతో పాటు 15 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించాడు. అదేవిధంగా 2 లక్షలుగా ఉన్న సబ్‌స్రైబర్స్‌ను 3 లక్షలకు పెంచుకోగలిగాడు. కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కుమారుడ్ని సుశాంత్‌ కేసులోకి లాగి గతంలో ఇతడు ఓ సారి జైలు పాలయ్యాడు.