మనిషి మాంసంతో కూర వండి.. వెన్నులో వణుకు పుట్టించే ఘటన

Crime Published On : Tuesday, March 10, 2020 03:35 PM

మనిషి మాంసంతో వంట చేస్తున్న భర్తను చూసిన భార్య షాక్‌కు గురైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజనూర్ పట్టణ సమీపంలోని టిక్కోపూర్ గ్రామంలో సంచలనం రేపింది. టిక్కోపూర్ గ్రామానికి చెందిన సంజయ్ పీకల దాకా మద్యం తాగి మనిషి మాంసంతో వంట చేస్తున్నాడు.

వీక్లీ మార్కెట్‌కు వెళ్లిన సంజయ్ భార్య (32) తిరిగి ఇంటికి వచ్చేసరికి భర్త వంటగదిలో పొయ్యిపై కడాయిలో మనిషి చేయి, వేళ్ల భాగాల మాంసాన్ని వండుతూ కనిపించాడు. అంతే షాక్ కు గురైన భార్య భర్త సంజయ్‌ను ఇంట్లోనే ఉంచి బయట నుంచి తలుపు మూసివేసి బయటకు పరుగెత్తింది. అనంతరం భార్య పొరుగింటి వారితోపాటు పోలీసులకు విషయం చెప్పింది. దీంతో పోలీసులు వచ్చి చూడగా సంజయ్ మద్యం మత్తులో గంగా నదీ తీరంలోని శ్మశానవాటిక నుంచి మనిషి చేతి మాంసాన్ని తీసుకువచ్చి కడాయిలో వేసి వండుతున్నాడని తేలింది. పోలీసులు సంజయ్ ను అరెస్టు చేసి, అతనిపై కేసు నమోదు చేశారు. మనిషి మాంసాన్ని ఫ్రై చేసిన భర్త ఇంటికి తిరిగి వెళ్లేందుకు భార్య భయపడుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.