జయరాం హత్య కేసులో వీడిన మిస్టరీ

Crime Published On : Sunday, February 3, 2019 11:17 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్నారై జయారం గత రెండు రోజులు క్రితం అనుమాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జయరాం హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. చిగురుపాటి జయరాం హత్యకేసులో రాకేష్ అని వ్యక్తి ప్రధాన సూత్రధారి అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.

రూ. 4.5 కోట్ల వ్యవహారమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జయరాంను హైదారాబాదులోనే చంపేసి కారులో తీసుకెళ్లి నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కనే కారులో వదిలేసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. జయరాం శరీరంపై అనుమాస్పదంగా ఉన్న గాయాలు, మృతదేహం వెనుక సీటులో ఉండటం మరియు కారు ఎలాంటి ప్రమాదానికి గురికాకపోవడంతో అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని చేధించారు. అయితే, రాకేష్ ఒక్కడే ఈ హత్య చేసి ఉండడని.. ఈ హత్య వెనుక ఇంకా ఎవరో ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ దిశగా కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.