ప్రేమించి పెళ్లాడిన యువతిని చంపి పొలంలో పాతిపెట్టాడు

Crime Published On : Wednesday, March 25, 2020 01:38 PM

ప్రేమించి పెళ్లి చేసుకొని సంవత్సరం కూడా తిరగకుండానే భార్యను చంపి పొలంలో పూడ్చిపెట్టాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం వనమరెడ్డిగారిపల్లెలో చోటుచేసుకుంది. కురబటకోటకు చెందిన గాయత్రి(28) తిరుపతిలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసింది. తిరుపతి నుంచి మదనపల్లెకు వచ్చే ఆర్టీసీ బస్సులో రోజూ ప్రయాణించే గాయత్రిని ఆ డ్రైవర్‌ మల్‌రెడ్డి ప్రేమించాడు. వీరిద్దరు పెద్దలకు తెలీకుండా 2019 ఫిబ్రవరి 12న ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ క్రమంలో మల్‌రెడ్డి, అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించారు. దీంతో ఆమె 2019 సెప్టెంబరు 10న ముదివేడు పోలీసులకు గాయత్రి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

అయితే, ఈ ఏడాది జనవరి 2 నుంచి గాయత్రి కన్పించకుండా పోయింది. 6వ తేదీన మల్‌రెడ్డి మదనపల్లె రూరల్‌ పోలీస్‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశాడు. అటు.. గాయత్రి తల్లి కూడా అల్లుడు, అతని కుటుంబసభ్యులపై ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 2వ తేదీన గాయత్రి తనకు ఫోన్ చేసి, ప్రాణ హాని ఉందని చెప్పిందని వెల్లడించింది. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. గాయత్రిని చంపేసి పొలంలో పూడ్చి పెట్టినట్లు మల్‌రెడ్డి ఒప్పుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.