Family Members Suicide: రాజమండ్రిలో ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉరివేసుకొని ఆత్మహత్య 

Crime Published On : Saturday, January 2, 2021 03:15 PM

Rajahmundry, Nov 23: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అంబేద్కర్‌ నగర్‌ రామాలయం వీధిలో విషాదకర ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరివేసుకొని ఆత్మహత్య (Family Members Suicide) చేసుకున్నారు. విజయవాడకు చెందిన భర్త నాగేంద్ర కుమార్ రెండో పెళ్ళి చేసుకున్నాడనే మనస్తాపంతో ఆయన భార్య తన కుమార్తెలు, కుమారుడితో కలిసి ఆత్మహత్య (committed suicide) చేసుకున్నారు. 

మృతులను సంగిశెట్టి కృష్ణవేణి(55), భూపతి శివపావని (27) నిషాన్ (9), రితికా (7)గా గుర్తించారు. ఈ విషాద ఘటనతో రాజమండ్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడ విషాధ ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు జరిగింది. గది అద్దెకు ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన ధర్మవరంలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నగరంలోని ఉమా లాడ్జికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో ఉండటంతో లాడ్జి మేనేజర్‌ ఈశ్వరయ్య గదిని అద్దెకు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో మద్యం మత్తులో ఆయనతో గొడవ పడి దారుణంగా హతమార్చారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారీలో ఉన్నారు. 

ఇక తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండల పరిధిలోని వేములలో ఆదివారం ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యాదయ్య, శారదమ్మల రెండో కుమారుడు శ్రీకాంత్‌(20) ఇంటర్‌ వరకు చదివాడు. అదే గ్రామానికి చెందిన శ్రీను, ఈశ్వరమ్మ కూతురు అఖిల (15) మిడ్జిల్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసింది. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి విషయం ఇరు కుటుంబసభ్యులకు తెలియడంతో.. ఈ వయస్సులో పెళ్లి సరికాదని మందలించారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఇద్దరు కలిసి ఇంటి నుంచి వెళ్లి.. గ్రామానికి దూరంగా ఓ మామిడి తోట దగ్గర వేప చెట్టుకు ఉరి వేసుకున్నారు. రాత్రి తోట దగ్గర  కాపలా ఉండే వ్యక్తి చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. తమ పిల్లలు విగత జీవులుగా చూసి వారి తల్లిదండ్రులు విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.