యమపాశమైన ఆకలి, జొన్న రొట్టెలు తిని ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి 

Crime Published On : Wednesday, February 17, 2021 02:00 PM

Sangareddy, Dec 26: తెలంగాణలో సంగారెడ్డి జిల్లా (Telangana's Sangareddy) మండలం పల్వట్లలో జొన్న రొట్టెలు తిని ఒకే కుటుబంలో ఐదుమంది మృత్యువాత (FIve die after eating rotis) పడ్డారు. మొదటి తల్లి జొన్న రొట్టెలు (jowar) తిని అస్వస్థతకు గురై మరణించగా ఆమె అంత్యక్రియలకు వచ్చిన ఇద్దరు కుమారులు, ఒక కోడలు సైతం అదే పిండితో జొన్న రొట్టెలు చేసుకుని తిని విగతజీవులయ్యారు. మరో ఇద్దర్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారిలో ఒకరు మరణించారు. 10 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. పల్వట్లకి చెందిన మఠం శంకరమ్మ (80) ఈనెల 13న విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురై మృతి చెందింది. ఆమె దశదినకర్మ ముగిసిన అనంతరం, సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న జొన్న పిండితో రొట్టె లు చేసుకుని శంకరమ్మ కుమారులు చంద్రమౌళి (55), శ్రీశైలం (48), కోడళ్లు సుశీల (60), అనసూజ, సరిత తిన్నారు. మనవలు, మనవరాళ్లు శిరీష, సంధ్య, సాయి వరుణ్‌ రొట్టెలు వద్దనడంతో వారికి అన్నం వండి పెట్టారు. 

రొట్టెలను తిన్న వారికి కొద్ది సేపటికే మత్తు రావడంతో కొద్దిసేపు పడుకున్నా రు. గంట తర్వాత విరేచనాలు, వాంతులు కావడంతో మనవలు, మనవరాళ్లు ఇంటి పక్క వారి సాయంతో 108 వాహనంలో జోగిపేట ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపే చంద్రమౌళి, సుశీ ల మృతి చెందారు. శ్రీశైలం, సరితను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా కు, అనసూజను బాలానగర్‌లోని బీబీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో సోమవారం రాత్రి శ్రీశైలం కూడా మరణించాడు. 

సరిత, అనసూజ  పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే  చికిత్స తీసుకుంటున్న ఇద్దరిలో బీబీఆర్‌ ఆస్పత్రిలో ఉన్న అనుసూజ(48) గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆ కుటంబం మరింత శోకసంద్రంలో మునిపోయింది. సరిత ఉస్మానియ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోందని, ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, తల్లి శంకరమ్మ దహన సంస్కారాలు నిర్వహించిన ఆమె చిన్న కుమారుడు సంతోష్‌ తన భార్యతో కలసి నారాయణఖేడ్‌ వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

జొన్నపిండిలో ఏమైనా విషపదార్థాలు ఉన్నాయా అన్న దానిపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. పిండి, రొట్టెలను స్వాధీనం చేసుకొని నాచారం వద్ద పరీక్ష కేంద్రానికి పంపించారు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.