ప్రేమించి మోసం చేసిందని... పెళ్లి పీటలపైనే...

Crime Published On : Thursday, March 14, 2019 06:16 PM

కళ్యాణ మండపం అందరితో కళకళలాడుతుంది. బంధువులంతా వచ్చేశారు. ముహుర్త సమయం దగ్గర పడటంతో పెళ్లికూతురుని తీసుకొచ్చి పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. పూలవర్షం కురవాల్సిన పెళ్లి మండపాన కాల్పులు చోటుచేసుకున్నాయి. అంతే ఒక్కసారిగా నవ వధువు కుప్పకూలిపోయింది. పెళ్లి మండపంలోనే ప్రాణాలు వదిలింది. సంచలనం రేకెత్తించిన ఈఘటన ఉత్తర్ ప్రదేశ్ రాయ్‌బరేలీ జిల్లాలోని ఘజియాపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... బిజేంద్ర అనే అబ్బాయి-ఆశ అనే అమ్మాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి తరపు పెద్దలు ఒప్పుకోలేదు. అంతేకాదు, వేరే వ్యక్తితో ఆశకు పెళ్లికూడా నిశ్చయించారు. తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గిన ఆశ పెళ్లికి అంగీకరించక తప్పలేదు.

దీంతో బీజేంద్ర తన ప్రేమ విఫలం అయిందని ఆవేదనచెందాడు. తన ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లాడబోతోందన్న విషయం తెలిసి తట్టుకోలేకపోయాడు. వెంటనే తుపాకితో ఆశ పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆశ వచ్చి పెళ్లి పీటలపై కూర్చోగానే కాల్పులు జరిపాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశ పెళ్లిపీటలపైనే ప్రాణాలు విడిచిపెట్టగా, బిజేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.