కోహ్లీ కోరితే ఓపెనింగ్‌ చేస్తా: విహారి

Saturday, December 1, 2018 07:18 AM Sports
కోహ్లీ కోరితే ఓపెనింగ్‌ చేస్తా: విహారి

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్ కోహ్లీ అడిగితే తాను ఓపెనింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రా ఆటగాడు హనుమ విహారి చెప్పాడు. గత ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన హనుమ విహారి ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు. మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడి తానేంటో నిరూపించుకున్నాడు.

ఆ తర్వాత న్యూజిలాండ్‌లో అనధికార టెస్టులో, ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా డిసెంబర్ 6 నుంచి ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ అడిగితే ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓపెనింగ్‌ చేస్తానని హనుమ విహారి అన్నాడు.

ఆస్ట్రేలియాలో ఆడేందుకు అవసరమైన ప్రతిదీ నేర్చుకుంటున్నా

"ఆసీస్‌లో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, సీనియర్లు ఇంగ్లాండ్‌లో నాకు సహకరించారు. ఆస్ట్రేలియాలో ఆడేందుకు అవసరమైన ప్రతిదీ నేర్చుకుంటున్నాను. ఇంగ్లిష్‌ గడ్డపై నేను హాఫ్ సెంచరీ చేశా. అక్కడ ఆడినట్టే ఆస్ట్రేలియాలో ఆడతాను. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు నేను సిద్ధం. కెప్టెన్ అడిగితే ఓపెనింగ్‌ చేస్తా" అని విహారి తెలిపాడు.

ఇది చాలా పెద్ద సిరీస్‌

"మిడిల్‌, లోయర్‌ ఆర్డరైనా ఫర్వాలేదు. ఇది చాలా పెద్ద సిరీస్‌. చాలా శ్రమించాను. నాపై విశ్వాసం చూపినందుకు కోహ్లీకి ధన్యవాదాలు. బ్యాటింగ్‌ నా ప్రధాన బలం. అవసరమైనప్పుడు బౌలింగ్‌ చేస్తా. ఇంగ్లాండ్‌ సిరీస్‌ తర్వాత వీవీఎస్‌ లక్ష్మణ్‌ నాతో మాట్లాడారు. నా రంజీ మ్యాచ్‌లను వీక్షించారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఎలా ఆడాలో సలహాలు ఇచ్చారు. ఆయన నా పక్కనుండటం అదృష్టం" అని అన్నాడు.

వార్మప్ మ్యాచ్‌లో గాయపడిన యువ ఓపెనర్ పృథ్వీ షా

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో శుక్రవారం ఫీల్డింగ్ చేస్తూ యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో తొలి టెస్టుకి దూరమయ్యాడు. దీంతో పృథ్వీ షా స్థానంలో ఎవరిని ఆడించాలనే దానిపై జట్టు మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. ఆస్ట్రేలియా పర్యటన కోసం సెలక్టర్లు జట్టులో పృథ్వీ షా, కేఎల్ రాహుల్, మురళీ విజయ్ రూపంలో ఓపెనర్లను ఎంపిక చేశారు.

For All Tech Queries Please Click Here..!