వినాయకుడు మైల పడతాడని వైసీపీ దళిత ఎమ్మెల్యే పై హేళన, కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే.

Tuesday, September 3, 2019 12:54 PM Politics
వినాయకుడు మైల పడతాడని వైసీపీ దళిత ఎమ్మెల్యే పై హేళన, కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే.

రాష్ట్రంలో వినాయక చవితి పండుగ రోజున అందరూ సంతోషంగా వినాయకుడి పూజలు చేస్తే , వినాయకుడి సాక్షిగా అధికార పార్టీకి చెందిన ఓ దళిత ఎమ్మెల్యేకు అవమానం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించారు కొందరు టిడిపి నేతలు. వినాయకచవితి వేడుకల సాక్షిగా జరిగిన ఈ ఘటనలో ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టారు. తనను అవమానించిన వారిపై న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్థానిక టీడీపీ నేతలు చేసిన అవమానకర వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వినాయక మండపం వద్ద పూజలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి కి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఆమె వ్యతిరేకులు కొందరు ఆమె దళిత మహిళ కాబట్టి పూజలు చేయడాన్ని వ్యతిరేకించారు. శ్రీదేవి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ ఆమెను కులం పేరుతో దూషించి హేళన చేశారు.దీంతో మనస్తాపానికి లోనైన ఎమ్మెల్యే కంటతడి పెట్టారు.

ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్యవాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ సంఘటన తర్వాత శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. తనను అవమానించిన టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతలు ఇంకా మారలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికి టిడిపి నేతలు తామే అధికారంలో ఉన్నట్టు ఫీలవుతున్నారని తెలిపారు ఎమ్మెల్యే శ్రీదేవి. ఓ దళిత మహిళా ఎమ్మెల్యేను అని కూడా చూడకుండా తనను కులం పేరుతో దూషించడం తగదని ఆమె పేర్కొన్నారు. ఇక దళిత మహిళా ఎమ్మెల్యేను వినాయక పూజ నిర్వహించవద్దని అడ్డుకున్న టిడిపి నేతలపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అణగారిన వర్గాల వారు అంటే టీడీపీకి ఎప్పుడూ చిన్నచూపేనన్న ఎమ్మెల్యే శ్రీదేవి ఓ మహిళా ఎమ్మెల్యే విషయంలోనే ఇలా ఉంటే సాధారణ ప్రజల విషయంలో ఇంకెలా వ్యవహరిస్తారో ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపైన్యాయం పోరాటం చేస్తానని కూడా శ్రీదేవి తెలిపారు.

For All Tech Queries Please Click Here..!
Topics: