తాజా రాజకీయ పరిణామాలపై ఉప రాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు
తాజా రాజకీయ పరిణామాలపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ రాజకీయాల్లో ఈ ధోరణి ప్రమాదకరమన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్లు ఆలస్యం చేయడం సరికాదని సభ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం దారుణమని ఎన్నికల కేసులను త్వరగా పరిష్కరించాలని, ఆర్థిక నేరగాళ్లు దేశం దాటకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలు విచిత్రంగా ఉంటున్నాయన్నారు.
అమలు సాధ్యంకాని హామీలు ఇవ్వడంపై రాజకీయ పార్టీలు ఆలోచించాలన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా హామీలు గుప్పిస్తున్నారని కులం, మతం, ధనంతో సంబంధం లేకుండా ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. అభ్యర్థి గుణం, సామర్థ్యాన్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.