టీడీపీ నేత హోటల్ కూల్చివేత
దుర్గిలో టీడీపీ నేత సింగు నాగేశ్వరరావుకు చెందిన హోటల్ గ్రామ సచివాలయానికి అడ్డుగా ఉందని అధికారులు గురువారం తెల్లవారుజామున కూల్చేశారు. హోటల్ను ఖాళీ చేయాలని ఇటీవల నోటీసు జారీ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో అధికారులు మంగళవారం రాత్రి హోటల్ను కూల్చేందుకు ప్రయత్నించగా ఆత్మహత్య చేసుకుంటామని నాగేశ్వరరావు కుటుంబసభ్యులు బెదిరించారు. దీంతో అధికారులు వెనుదిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున హోటల్ను కూల్చి, సామగ్రిని మండల పరిషత్ కార్యాలయానికి తరలించారు.
టీడీపీకి అండగా ఉంటున్న బడుగు, బలహీన వర్గాలపై వైసీపీ దాడులు పెరిగాయని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు విమర్శించారు. వైసీపీ కక్షపూరిత చర్యలు మానుకోవాలని హితవుపలికారు. అధికారులు కూల్చిన హోటల్ను వారు పరిశీలించి విలేకరులతో మాట్లాడారు.హోటల్ కూల్చివేతపై నిజానిజాలను తెలుసుకుని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి రావాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాలతో తాము ఇక్కడకు వచ్చామన్నారు. నాగేశ్వరరావుకు జరిగిన అన్యాయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్తామన్నారు. అధికారులు కూడా విధి నిర్వహణలో హద్దులు దాటి వ్యవహరిస్తున్నారన్నారు. సచివాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని తప్పుబట్టారు.