తమిళ భాషపై మోడీ ప్రసంశల వర్షం, అమిత్ షా ‘‘హిందీ ’’వ్యాఖ్యలు చల్లార్చడానికేనా ?

Friday, October 18, 2019 03:00 PM Politics
తమిళ భాషపై మోడీ ప్రసంశల వర్షం, అమిత్ షా ‘‘హిందీ ’’వ్యాఖ్యలు చల్లార్చడానికేనా ?

దేశ వ్యాప్తంగా హిందీని అమలు చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమయిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఆ మంటలు చల్లార్చడానికి తమిళ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాంతీయ భాషల గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఐఐటీ-మద్రాస్ స్నాతకోత్సవంలో భాగంగా తమిళ భాషపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోనే కాక ప్రపంచంలో తమిళ భాష చాలా ప్రాచీనమైనదని, ఉన్నతమైనదని, ప్రపంచంలో తమిళ భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. కాగా దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికయిన తరువాత మోడీ తొలిసారి తమిళనాడులో పర్యటించారు. దేశ వ్యాప్తంగా హిందీని అమలు చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమయిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాశంగా మారింది. దక్షిణాది సూపర్ స్టార్, రజనీకాంత్, కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలను నిరసన వ్యక్తం చేసిన సంగతి విదితమే. 

దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికయిన తరువాత మోడీ తొలిసారి తమిళనాడులో పర్యటించారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు భారతీయయ జనతాపార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కేంద్ర మాజీమంత్రి పొన్ రాధాకృష్ణన్ సహా పలువురు బీజేపీ నాయకులు, అన్నా డీఎంకే కార్యకర్తలు విమానాశ్రయం వద్ద మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ కొద్దిసేపు మాట్లాడారు. వణక్కం.. అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

చెన్నై పర్యటన తనకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తుందన్న ఆయన.. 2019 ఎన్నికల తర్వాత తన తొలి పర్యటన ఇదేనని చెప్పారు.ప్రపంచంలోనే అతి ప్రాచీన భాషగా తమిళానికి గుర్తింపు ఉందని, అమెరికాలో ఆ భాషను గౌరవించే వారి సంఖ్య వేలల్లో ఉందని చెప్పారు. ఈ సంధర్భంగా అమెరికా పర్యటనను గుర్తు చేశారు.

అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్ లో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమంలో ఎనిమిది భాషల్లో మాట్లాడానని, తాను తమిళంలో మాట్లాడిన సమయంలో వేలాది మంది తనను అదే భాషలో పలకరించారని చెప్పుకొచ్చారు. హౌడీ మోడీ కార్యక్రమంలో మిగిలిన అన్ని భాషల కంటే తమిళం ఎక్కువగా వినిపించిందని, సభలో మారుమోగిపోయిందని ప్రధాని అన్నారు. తమిళ భాషకు చాలా చారిత్రాత్మక, ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇటీవల తాను ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన వేళ తమిళ పదాలను కూడా వాడానని ఆయన గుర్తుచేశారు. కాగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ హిందీని జాతీయ భాషగా అమలు చేయాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన దక్షిణాదిన పెను ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. 

ఐక్యరాజ్యసమితిలో సుప్రసిద్ధ తమిళ కవి ‘కణియన్ పూంగుండ్రనార్’ మాటలను ఉటంకిస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ‘యాదుమ్ ఒరే యావారుమ్ కెళిర్’ అన్న కవి వ్యాఖ్యలతో ప్రపంచానికి భారత ఆదర్శాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. ‘మనం అందరికీ.. అన్ని ప్రాంతాలకు చెందినవాళ్లం’ అనేది దీని అర్థం. మూడువేల ఏళ్ల క్రితం జీవించిన ఆ మహాకవిని తన ప్రసంగం ద్వారా మరోసారి యావత్ ప్రపంచానికి మోడీ గుర్తు చేశారు. మనం ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ జీవిస్తున్నా మనం పుట్టిన భూమిని అందరూ గుర్తు పెట్టుకోవాలని కోరారు

For All Tech Queries Please Click Here..!