జగన్ కు కొరకరాని కొయ్యలుగా మారింది వీరే, సమయం చూసి ఒక్కొక్కరికి షాక్ లు... !
ఏపీలో రాజ్యాంగ సంస్ధల అధిపతులుగా ఉన్న కొందరు అధికారులు, నేతలు సీఎం జగన్ కు కొరకరాని కొయ్యలుగా మారిపోతున్నారు. గతంలో చాలా ప్రభుత్వాల్లో అధినేతలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నా ఈసారి జగన్ మాత్రం వారందరికంటే ఎక్కువగా వీరి విషయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే వీరిని తొలగించే విషయంలో మాత్రం నిబంధనలు అంగీకరించకపోవడంతో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో రాజ్యాంగ సంస్ధల రద్దు వంటి తీవ్ర నిర్ణయాలకు సైతం సిద్ధమవుతున్నట్లుగా అర్దమవుతోంది.
వివిధ కారణాలతో ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ జలీల్ ఖాన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలి జగన్ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అయితే వీరిని ప్రస్తుతం వారు ఉన్న పదవుల నుంచి తప్పించే వీలు లేదు. దీంతో వారిని తప్పించేందుకు ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తూనే అవసరమైతే వ్యవస్ధల రద్దుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతోంది. సెలక్ట్ కమిటీకి రాజధాని బిల్లులు పంపిందన్న కారణంతో శాసన మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం ఇందులో భాగమే. అయితే మండలిని రద్దు చేసినంత సులువుగా మిగతా వ్యవస్దలను రద్దు చేయడం మాత్రం సాధ్యం కాదు.