బ్రేకింగ్: టీఆర్ఎస్లోకి కేసీఆర్ ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. గజ్వేల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్లో చేరేందుకు సన్నాహాలు ప్రారంభించారు. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నియోజకర్గం నుంచి సీఎం కేసీఆర్పై ఎమ్మెల్యేగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటి చేశారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్లో చేరనున్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఒంటేరు దారుణంగా ఓడిపోవడంతో తన రాజకీయ భవిష్యత్తు అంధకారమవుతుందన్న ఆలోచనతో ఏకంగా టిఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్దమైపోయాడు. నిన్న మొన్నటి వరకు సీఎం కేసీఆర్పై విమర్శలు చేసిన ఒంటేరు టిఆర్ఎస్లో చేరడం అందరినీ షాక్కు గురిచేసింది. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఖంగుతిన్నారు.
సీఎం కేసీఆర్ ను ఓడించడమే తన జీవిత లక్ష్యమని ప్రకటించిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిఆర్ ఎస్ లో చేరనుండడంతో తెలంగాణ రాజకీయాలలో మరో సంచలనానికి తెరలేపిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని, తనకు ప్రాణ హాని ఉందని ఒంటేరు ఎన్నికల సమయం లో సంచలన ఆరోపణలు చేశారు. ఏదేమైనప్పటికీ నిన్న మొన్నటి వరకు అగ్గి మీద గుగ్గిలమైన నేతలు ఇప్పుడు ఒకే తాటిపైకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.