ఉద్వేగం..కసి..ఆనందం..జగన్ కళ్లల్లో కన్నీరు: తండ్రిని తల్చుకోగానే.
"వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను" అంటూ ప్రమాణ స్వీకారం ప్రారంభించగానే ఒక్క సారిగా ప్రాంగణంలో కేరింతలు చప్పట్లతో జగన్ అనుకూల నినాదాలు. అదే సమయంలో జగన్ లో నియంత్రించుకుంటున్న ఉద్వేగం సాధించాననే కసి సీఎం అయ్యాననే ఆనందం పడిన కష్టాలు తలచుకొని ఆపులేక పోయిన కన్నీరు, తండ్రి పేరు తలవగానే తల్లి విజయమ్మ కంట కన్నీరు ఆనంద భాష్పాలు ముఖ్యమంత్రి అయినా ఓ తల్లి కుమారుడినే అంటూ ఓదార్పు. అక్కడ ఉన్న అభిమానులు సైతం ఒక్క సారిగా అందరూ వారినే చూస్తూ ఉండి పోయారు.
గవర్నర్ నరసింహన్ జగన్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించటం మొదలు పెట్టారు. అందరూ తన తండ్రి తరహాలోనే ఇంటి పేరుతో సహా జగన్ చెబుతారని భావించారు. అయితే, జగన్ మాత్రం కేవలం వైయస్ జగన్మోహన్రెడ్డి అనే నేను అంటూ ప్రారంభించారు. ఆ సమయంలో జగన్ కళ్లల్లో, గొంతులో, ముఖములో ఉద్వేగం కనిపించింది. కష్టాలను ఎదురు నిలబడి సాధించని కసి కనిపించింది. కష్టానికి ఫలితం లభించిందనే ఆనందం ఆవిష్కృతమైంది. కంటి నుండి బయటకు వస్తున్న ఆనంద భాష్పాలను నియంత్రించుకుంటూ జగన్ తన ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేసారు. ఆ తరువాత తన ప్రసంగం సమయంలోనూ ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకున్నారు. చివరకు మాత్రం ఇక అపులేక పోయారు. తన తండ్రిని తలచుకున్నారు. తల్లికి పాదాభివందనం అని చెబుతూ అప్పటి వరకు నియంత్రించుకుంటూ వచ్చిన జగన్ ప్రసంగం ముగింపులో ఒక్క సారిగా భావోద్వేగానికి గురవుతూ కన్నీరు కార్చేసారు.