అమెరికాకు చావు తప్పదు, 52 కాదు 290 టార్గెట్లు రెడీ అంటున్న ఇరాన్
అమెరికా, ఇరాన్ దేశాల (Iran vs America War) మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు దేశాల మధ్య మూడవ ప్రపంచ యుద్ధం వస్తోందా..(World War 3 Fears Erupt)అన్నంతగా వార్ నడుస్తోంది. ఈ రెండు దేశాల పరస్పర దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ (Iran) అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడి జరిపింది. అయితే ఇరాక్లో జరిపిన రాకెట్ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇరాన్ను హెచ్చరించిన విషయం ఇంతకుముందు చదువుకున్న సంగతి తెలిసిందే.
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అమెరికా (America)జరిపిన డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ సులేమానీ అంతిమయాత్రకు(Qasem Soleimani Funeral) కోట్లాది మంది తరలివచ్చి అశ్రునివాళి అర్పించారు. ఈ సందర్భంగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ( Iranian President Hassan Rouhani) సహా సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ(Ayatollah Khamenei) తేల్చి చెప్పారు. ట్రంప్ తలపై సుమారు రూ. 575 కోట్ల రివార్డు ప్రకటించినట్లు స్థానిక ప్రభుత్వ మీడియా కూడా పేర్కొంది. దీంతో పాటుగా అమెరికా బలగాలు తమ దేశం నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ ఇరాక్ పార్లమెంట్ తీర్మానించింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో తాము సైతం ప్రతీకారానికి దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు. 52 సైట్లను భస్మీ పటలం చేస్తామంటూ హెచ్చరికలు అమెరికా ఇరాన్ దేశానికి హెచ్చరికలు జారీ చేసింది.
52 ప్రదేశాలు లక్ష్యంగా దాడులకు పాల్పడతామన్న ట్రంప్ బెదిరింపులకు ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఎవరైతే నంబరు 52 గురించి మాట్లాడుతున్నారో.. వారు 290 గురించి కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ట్రంప్ 52 ప్రదేశాల్లో దాడి జరిపితే... తాము 290 టార్గెట్లు పెట్టుకుంటామని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటివి ఇరాన్ జాతిని బెదిరించలేవు’ అంటూ ట్వీట్ చేశారు. IR655 హ్యాష్ట్యాగ్తో అమెరికా అధ్యక్షునికి ఇరాన్ అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేశారు.
ఇంతకీ IR655 అంటే ఏంటీ ?
1988లో అమెరికా ఇరాన్లో సృష్టించిన మృత్యుఘోషే IR655. 1988 జూలై 3న టెహ్రాన్ నుంచి దుబాయ్ బయల్దేరిన ఇరాన్ ఎయిర్ ఫ్లైట్ 655 ను (Iran Air Flight 655 tragedy)అమెరికా నౌకాదళ క్షిపణి కూల్చివేసింది. అయితే ఇది అనుకోకుండా జరిగిన దాడి అని అమెరికా చేతులు దులుపుకుంది. కాగా ఈ దాడి సమయంలో విమానంలో ఉన్న మొత్తం 290 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 66 మంది పిల్లలు కూడా ఉన్నారు. అప్పుడు ఇరాన్- ఇరాక్ల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరాక్కు మద్దతుగా నిలిచిన అమెరికా ఇరాన్ విమానాన్ని కూల్చి వేసింది. పర్షియన్ గల్ఫ్లో షిప్పింగ్ మార్గాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పొరబాటున పౌర విమానాన్ని కూల్చివేశామని తెలిపింది.
అయితే ఈ మారణహోమాన్ని ఇరాన్ అంత తేలికగా మరచిపోలేదు. అమెరికన్లు మరచిపోయినా ఇరానియన్లలో మాత్రం అది అలాగే గుర్తు ఉండిపోయింది. తాజాగా సులేమాని అంత్యక్రియల్లో ఈ ఘటనను గుర్తు చేసుకున్నారు. అమెరికా 52 ప్రదేశాలకు దీన్ని జత కలిపి డొనాల్డ్ ట్రంపుకు వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు 52 ట్వీట్ ఏంటి ?
1979-81 మధ్య కాలంలో 52 మంది అమెరికన్లను ఇరాన్ బందీలుగా చెరపట్టింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికన్లపై కానీ, అమెరికా ఆస్తులపై కానీ, అమెరికా స్థావరాలపై కానీ దాడులకు దిగితే ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయి. ఇరాన్లో రాజకీయంగా, సైనికంగా, సాంస్కృతికంగా అత్యంత ముఖ్యమైన 52 ప్రాంతాలను గుర్తించాం. ఆ ప్రాంతాలు లక్ష్యంగా చేసే దాడులు అత్యంత తీవ్రంగా ఉంటాయి’ అని ట్రంప్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.