గుంటూరు కరోనా అనుమానితుల జాబితాలో పలువురు ఎమ్మెల్యేలు !
ఏపీలో నిన్న మొన్నటి వరకూ ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాని గుంటూరు జిల్లా ఇప్పుడు ఆ పేరు చెబితేనే వణుకుతోంది. దీనికి కారణం గుంటూరు నగరానికి చెందిన ఎమ్మెల్యే బావ మరిది ఢిల్లీకి వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతను 500 మందికి విందు ఏర్పాటు చేశాడు. ఇందులో పాల్గొన్న వారు మరిన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. దీంతో ఇప్పుడు వీరందరినీ గుర్తించి క్వారంటైన్ చేసే పనిలో అధికారులు రాత్రీపగలు శ్రమిస్తున్నారు.
ఎమ్మెల్యే బామ్మర్ది ఇచ్చిన పార్టీకి హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లాలో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. మరికొందరు ఏకంగా మసీదుల్లో ప్రార్ధనలకు కూడా హాజరయ్యారు. ఇదంతా సదరు కరోనా పాజిటివ్ బాధితుడికి రోగం బయటపడిన తర్వాతే జరగడం ఇంకా దారుణం. తమకెందుకు వస్తుందన్న నిర్లక్ష్యంతో పోలీసులు, ఇతర అధికారులు వారిస్తున్నా వినకుండా తాజాగా గుంటూరు జిల్లా తాడికొండలోని ఓ మసీదులో ప్రార్దనలకు కూడా వీరు హాజరయ్యారు. దీంతో సదరు ప్రార్ధనల్లో పాల్గొన్న వారందరినీ క్వారంటైన్ కు తరలించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.