నటనలో బాలయ్యను మించిపోయిన బాబు..
గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావటంతో అధికారం పోగొట్టుకుని చావుదెబ్బ తిన్న చంద్రబాబు ఇప్పటికి ఏమాత్రం మారలేదని వైసిపి నేత రవిచంద్రా రెడ్డి అన్నారు. ఎలా ఓడిపోయారు అన్నది చంద్రబాబుకు నేటికి అర్థం కాకపోవడం ఆశ్చర్యమని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయంలో ఆత్మవంచన చేసుకుంటూ వైసీపీ పైన నిందలు వేస్తున్నారని వైసీపీ నేత రవిచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. నటనలో బాలయ్యను మించిన లెజెండ్ చంద్రబాబని సెటైర్ వేశారు.
చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలపై వైసిపి నేత రవిచంద్రా రెడ్డి సెటైర్లు వేశారు. పాలిచ్చే ఆవును వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు అన్న బాబు వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తనను తాను పాలిచ్చే ఆవుతో పోల్చుకున్నారని, అలా, ఆయన పోల్చుకోగానే దాదాపు వంద ఆవులు మృత్యువాత పడ్డాయని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆవులు సైతం తట్టుకోలేక పోయాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక అంతే కాదు చంద్రబాబు పాలనంతా కరువుకాటకాలు పాలని, ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం అలమటించిన రోజులు అని పేర్కొన్న ఆయన చంద్రబాబు పరిపాలించిన అన్ని రోజులు వానలు పడలేదని, కరవు కాటకాలతో ప్రజలు అల్లాడారని అన్నారు.