నిమ్మగడ్డ లేఖ వివాదంపై కేంద్రం ట్విస్ట్: ఇప్పుడు జగన్ నిర్ణయమేంటి.!
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారని,అందులో ఏపీ ప్రభుత్వ పైన తీవ్ర ఆరోపణలు చేసారంటూ బుధవారం సాయంత్రం నుండి ఒక లేఖ వైరల్ అయింది. అయితే, రాత్రి పొద్దు పోయిన తరువాత నిమ్మగడ్డ తాను ఎటువంటి లేఖ రాయలేదని స్పష్టత ఇచ్చినట్లు ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇదే సమయంలో ఇది టీడీపీ కుట్ర ని,టీడీపీ కార్యాలయం నుండి వారికి మద్దతుగా నిలిచే ఛానళ్లుకు ఈ లేఖలు వెళ్లాయ నేది వైసీపీ ఆరోపణ. ఇదే తరహాలో వైసీపీ నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేసారు.
ఇది ఇలా కొనసాగుతున్న సమయంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి అందిందని స్పష్టం చేసారు. ఆ లేఖ ఎన్నికల కమిషనర్ రాసినట్లుగా గుర్తించామని తేల్చి చెప్పారు.యితే, తనకు రక్షణ కావాలని నిమ్మగడ్డ లేఖ రాసినట్లుగా ప్రచారం సాగటం,దీని పైన భిన్న కోణాలు చర్చకు వచ్చిన సమయంలోనే కేంద్ర బలగాలతో ఎన్నికల సంఘం కార్యాలయంతో పాటుగా, నిమ్మగడ్డ నివాసం వద్ద భద్రత కల్పించారు. అయితే, తమ ప్రభుత్వం ఆ లేఖ ఎవరు రాసారనేది విచారణలో ఉన్నా,సుమోటోగా భద్రత కల్పించామని వైసీపీ నేతలు చెబుతున్నారు.