ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.21 వేల కోట్ల రుణం ఇవ్వనున్న ఏఐఐబీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు.ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఏఐఐబీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ డి.జె.పాండియన్, డైరెక్టర్ జనరల్–ఇన్వెస్ట్మెంట్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ యీ–ఎన్–పంగ్, ప్రిన్సిపల్ సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ సోమనాథ్ బసు భేటీ అయ్యారు.
ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, 62 శాతం మంది ప్రజలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని, ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగమేనని సీఎం జగన్ ఈ సందర్భంగా వారికి వివరించారు. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులు తమకు అత్యంత ప్రాధాన్యమైనవని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రాధాన్యత అనుకుంటే దానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు అందగానే వెంటనే ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని బ్యాంకు ప్రతినిధులు స్పష్టం చేశారు.