టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి..!

Saturday, June 22, 2019 10:13 AM News
టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి..!

వైసీపీ నేత మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌గా ఈరోజు(22 జూన్ 2019) న బాధ్యతలు స్వీకరించారు. హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ చట్టం 1987 ప్రకారం ప్రభుత్వం టీటీడీకి కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. ఈ సంధర్భంగా మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి టీటీడీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని, గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామని అన్నారు. భక్తులకు సేవ చేసే భాగ్యం తనకు కల్పించినందుకు సీఎం జగన్‌కు వైవీ కృతజ్ఞతలు తెలిపారు. వసతుల కల్పన, సామాన్య భక్తుని నుంచి ప్రతీ ఒక్కరికి దర్శనం, ఉద్యోగులకు భద్రత వంటి అంశాలపైన ఫోకస్ చేస్తానని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 

టీటీడీకి వచ్చే డబ్బు స్వామివారికే దక్కాలని, అక్కడ నుంచి అవి పేద ప్రజలకు చేరాలని, అక్రమార్కుల చేతుల్లోకి ఈ డబ్బులు వెళ్లకుండా చేసే బాధ్యత ఇప్పుడు తనపై ఉందని స్పష్టం చేశారు. హిందూ ధర్మ ప్రచారాన్ని కాపాడుకుంటూ టీటీడీ అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి జగన్ తనకు చూపినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. త్వరలోనే పాలకమండలి సభ్యుల నియామకాలు కూడా జరుగుతాయని ఆయన తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ 50వ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

For All Tech Queries Please Click Here..!