తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. మధ్యాహ్నం ఒంటి గంటవరకు పోలింగ్ కొనసాగనుంది. 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. రెండో విడతలో 788 గ్రామాలు ఏకగ్రీవం కానున్నాయి. ఐదు గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. సర్పంచ్ పదవులకు 10,668 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. అనంతరం ఉప సర్పంచి ఎన్నికను అధికారులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రెండో విడత పోలింగ్ జరిగే పంచాయతీల్లో వార్డు సభ్యుల పదవులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 36 వేల 602 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీచేస్తే.. 94 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. పదివేల 317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 26 వేల 191 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. వార్డు సభ్యుల పదవులకు 63 వేల 480 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో విడత పోలింగ్ జరిగే పంచాయతీల్లో చాలా సున్నితమైన, కీలకమైన గ్రామాలు ఉండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తొలి విడతలో ఉపయోగించిన బ్యాలెట్ పెట్టెలనే మలి విడతలో కూడా వాడుతున్నారు. మొదటి విడత ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందే రెండో దఫా కూడా పోలింగ్ విధుల్లో ఉన్నారు. తొలి విడత పోలింగ్లో తలెత్తిన లోపాలను దృష్టిలో పెట్టుకుని.. ఈసారి తప్పులు పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది.