రూ. 2,000 నోటు ముద్రణ రద్దు

Thursday, January 3, 2019 11:04 PM News
రూ. 2,000 నోటు ముద్రణ రద్దు

2 వేల రుపాయల నోట్ల వల్ల మనీలాండరింగ్ కేసులు పెరుగుతున్నట్టు గ్రహించిన కేంద్రం నోట్ల ముద్రణను నిలిపివేయాల్సిందిగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)ను ఆదేశించినట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 2 వేల నోటును ఉపసంహరించుకోనున్నట్లు గత కొంతకాలంగా హల్‌చల్ చేస్తున్న వార్తలకు ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం మరింత బలం చేకూర్చింది. 2016 నవంబరులో చివర్లో ఈ నోట్లను ప్రభుత్వం చలామణిలోకి తీసుకొచ్చింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
 
ముద్రణను నిలిపివేసినప్పటికీ నోట్లు చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే 2 వేల రుపాయల నోట్లను వెనక్కి తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలను ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఖండించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో పలుమార్లు స్పష్టం చేశారు. అయితే, తాజాగా వాటి ముద్రణను నిలిపివేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నోట్ల ముద్రణను నిలిపిస్తున్నట్టు తెలిపిన ఆర్బీఐ నోట్లు మాత్రం చలామణిలోనే ఉంటాయని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని స్పష్టం చేసింది.

For All Tech Queries Please Click Here..!