పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే 10 కోట్ల మంది మాడి మసైపోతారు

Monday, October 21, 2019 03:00 PM News
పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే 10 కోట్ల మంది మాడి మసైపోతారు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ ఇండియా మీద పగతో రగిలిపోతోంది. ఎప్పుడెప్పుడు దాడిచేద్దామా అని కాచుకుకూర్చుని ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా కాచుకో అంటూ ఇమ్రాన్ ఖాన్ కి హెచ్చరికలు జారీ చేస్తోంది. మొత్తం మీద వార్ సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సైంటిస్టులు ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే పరిస్థితి ఏంటీ అనే దానిపై కొన్ని విషయాలను బయటకు తెచ్చారు. పాకిస్తాన్ తో ఇండియా యుద్ధం చేస్తే జరిగే పరిణామాలు ఏంటీ, ప్రాణ నష్టం ఎంత ఉంటుంది అనే దానిపై ఓ నివేదికను తయారు చేశారు. ఆ నివేదికలో విస్తు గొలిపే నిజాలు ఉన్నాయి.

భారత్, పాకిస్తాన్‌ దేశాల మధ్య అణు యుద్ధమే గనక సంభవిస్తే కనివినీ ఎరగని స్థాయిలో ప్రాణ, పర్యావరణ నష్టం ఉంటుందని ఆ నివేదికలో బయటపడింది.ఈ నివేదిక ప్రకారం అణుయుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే 5 కోట్ల నుంచి 12.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొంది. అది రెండో ప్రపంచయుద్ధం జరిగిన ఆరేళ్లలో జరిగిన ప్రాణ నష్టం కంటే ఎక్కువని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ ప్రభావం ఉంటుందని పేర్కొంది. భారత్, పాక్‌ల మధ్య ఒకవేళ 2025లో యుద్ధం జరిగితే చోటు చేసుకునే పరిణామాలపై యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడొ బౌల్డర్, రట్జర్స్‌ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేశారు. ప్రస్తుతం భారత్, పాక్‌ల వద్ద సుమారు 150 చొప్పున అణ్వాయుధాలున్నాయని, అవి 2025 నాటికి 200 నుంచి 250 వరకు పెరగగలవన్నారు. భారత్, పాక్‌ యుద్ధం వల్ల సాధారణ మరణ రేటు ఒక్కసారిగా రెట్టింపు అవుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడొ బౌల్డర్‌లో ప్రొఫెసర్‌ అయిన బ్రయాన్‌ టూన్‌ పేర్కొన్నారు. ఈ అధ్యయన విశేషాలను ‘సైన్స్‌ అడ్వాన్సెస్‌’ అనే జర్నన్‌లో ప్రచురించారు.

వాతావరణంపై పెను ప్రభావం చూపి దశాబ్ద కాలంపాటు సూర్యుడి చుట్టూ పొగ అలముకుని తీవ్ర కరువు తాండవిస్తుందని వెల్లడించింది. భారత్, పాక్‌ల మధ్య పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 నాటికి భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారని, ఈ ఘటనలో అనేక మంది నాయకులు చనిపోతారని తెలిపింది. దీనికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ దాడిచేస్తుందని తెలిపింది. పీఓకేను దాటి తమ భూభాగంలోకి భారత్ వస్తుందనే భయంతో పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉందని, దీంతో చరిత్రలో అత్యంత ఘోరమైన యుద్ధానికి దారితీస్తుందని ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ రెండు దేశాలు 2025 నాటికి కనీసం 400 నుండి 500 అణు బాంబులను కలిగి వుండే అవకాశం వున్నట్లు ఆ అధ్యయనం పేర్కొంది. అణ్వాయుధ ప్రయోగం వల్ల వెలువడిన 16 నుంచి 36 మిలియన్‌ టన్నుల సూక్ష్మ కార్బన్‌ అణువులు కొన్ని వారాల్లోపే ప్రపంచమంతా వ్యాపిస్తాయన్నారు. ఇవి సోలార్‌ రేడియేషన్‌ను గ్రహించి, గాలిని మరింత వేడెక్కిస్తాయని వివరించారు. అలాగే, సూర్యరశ్మి భూమిని చేరడం 20% నుంచి 35% తగ్గుతుందని, దానివల్ల భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 2 నుంచి 5 సెల్సియస్‌ డిగ్రీలు తగ్గుతుందని పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం 15% నుంచి 30% తగ్గుతుందన్నారు. భూమిపై వృక్షసంపద వృద్ధి ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 30 శాతం పడిపోతుంది. మహాసముద్రాలు ఉత్పాదకత 5 నుంచి 15 శాతం తగ్గుతాయి. మొత్తంమీద, ఈ ప్రభావాల నుండి కోలుకోవడానికి పదేళ్ళకు పైగా పడుతుందని అధ్యయనం పేర్కొంది.

For All Tech Queries Please Click Here..!