పోలవరానికి రూ.3,000 కోట్లు విడుదల చేయనున్న కేంద్రం ..!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.3,000 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర జల వనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘నాబార్డు’ ద్వారా ఈ నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ఉత్తరువులు పంపింది. మరో రూ.1,810.04 కోట్ల మంజూరు చేయడానికి కసరత్తు చేస్తోంది. నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను(యూసీలు) రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పంపిస్తే, ప్రాజెక్టుకు వ్యయం చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది. గత ఏడాది జూలై 26న పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులపై ఆడిట్ చేయించి, ఆడిటెడ్ స్టేట్మెంట్ పంపితే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.
కానీ, 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు చేసిన వ్యయంపై ఆడిట్ చేయించడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. 2014 ఏప్రిల్ 1కి ముందు సేకరించిన భూములను, ఆ తర్వాత అంటే 2014 ఏప్రిల్ 1 తర్వాత సేకరించినట్లు చూపి భారీ ఎత్తున ప్రజాధనాన్ని కాజేయడం వల్లే ఆడిట్ చేయించడానికి అప్పటి ప్రభుత్వ పెద్దలు అంగీకరించలేదు అని వాదన. కేంద్ర జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) పదేపదే ఒత్తిడి తేవడంతో వ్యయానికి సంబంధించిన ఆడిట్ స్టేట్మెంట్ను మాత్రమే రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రానికి పంపింది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు 2014కు ముందు చేసిన వ్యయం రూ.1,397.19 కోట్లకు సంబంధించిన ఆడిట్ స్టేట్మెంట్ను పంపలేదు.