నా కుమారుడిని నరబలి ఇచ్చేందుకు అనుమతివ్వండి!

Saturday, February 2, 2019 02:44 PM News
నా కుమారుడిని నరబలి ఇచ్చేందుకు అనుమతివ్వండి!

ప్రపంచం ఊహకందని ఆవిష్కరణలతో ఎంతో వేగంగా ముందుకెళుతుంటే కొంత మంది మనుషులు ఇంకా మూఢనమ్మకాల వద్దే ఆగిపోతున్నారు. మూఢ నమ్మకాలతో ప్రజలు ఎంత ఘోరాలైనా చేసేందుకు వెనకాడటం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తి తన సొంత కొడుకునే బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అంతే కాకుండా ఈ నరబలికి అనుమతి ఇవ్వాలంటూ ఏకంగా అధికారులకు వినతి పత్రం సమర్పించాడు.

వివరాల్లోకి వెళ్తే...బీహార్‌లోని బెగుసరాయి జిల్లా మోహన్‌పూర్-పహాడ్‌పూర్ గ్రామ వాసి, తాంత్రికుడైన సురేంద్రప్రసాద్ సింగ్ తన కొడుకును బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. తన ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకునేందుకు నరబలికి అనుమతించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ లేఖ, బలికి సంబంధించి సురేంద్ర ప్రసాద్‌ ఓ విలేకరితో మాట్లాడుతున్న ఓ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది.

"నా ఆరాధ్య దేవత గుడికి ఆర్థిక సాయం చేయడానికి నా కొడుకు నిరాకరించాడు. అందుకే ఇంజనీర్‌ అయిన నా కొడుకును మా ఇంటి ఆరాధ్య దేవత కామాఖ్యదేవికి బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇదే నా మొదటి నరబలి.   నరబలి నేరం కాదు.  అందుకే బలి ఇవ్వాలనుకుంటున్నాను. నా కొడుకు రావణాసూరుడు లాంటి వాడు. నరబలికి అనుమతి ఇవ్వండి"  అంటూ సురేంద్రప్రసాద్‌ సింగ్‌ అన్న మాటలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే అలాంటి దరఖాస్తు తమకు అందలేదని, తాంత్రికుడి కోసం గాలిస్తున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. నరబలి చట్టవిరుద్ధమని, త్వరలోనే తాంత్రికుడిని పట్టుకుంటామని తెలిపారు. కాగా సురేంద్రప్రసాద్ సింగ్ ఓ పిచ్చోడని, ప్రచారం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడని స్థానికులు అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో అధికారులు అతిడిని అదుపులోకి తీసుకుంటే తప్ప తెలియదు.

For All Tech Queries Please Click Here..!