పంజా విసరనున్న పెథాయ్
కోస్తా జిల్లాలపై పంజా విసిరేందుకు పెను తుఫాన్ ‘పెథాయ్’ సిద్ధమైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి గురువారం వాయుగుండంగా మారింది. ఇది గంటకు 11కి.మీ. వేగంతో ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ సాయంత్రానికి మచిలీపట్నానికి 1,250 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది శుక్రవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, శనివారానికి తుఫాన్గా మారనుంది. తీరం దిశగా వచ్చేక్రమంలో తీవ్ర తుఫాన్గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
సముద్రం అల్లకల్లోలంగా మారడంతో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు రావాలని సూచించింది. శుక్రవారం నుంచి కోస్తాలో తీరంవెంబడి గంటకు 45నుంచి 50కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. 15నుంచి గాలుల తీవ్రత పెరిగి, 16కల్లా 100కి.మీ.కు చేరుతుందని తెలిపింది. తుఫాన్ మధ్య కోస్తాలో 16రాత్రి లేదా 17న ఉదయం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. కోస్తాలో అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. తుఫాన్ నేపథ్యంలో ఈనెల 15నుంచి కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయి. 16 నుంచి రెండు రోజుల పాటు కోస్తాలో విస్తారంగా, పలుచోట్ల భారీగా, అక్కడక్కడా 20సెం.మీ. కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. వేటకు వెళ్లిన మత్సకారులు వెనక్కి రావాలని ప్రభుత్వం ఆదేశించింది.
తుఫాన్ అంచనాల నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాలు, గ్రామీణ నీటి సరఫరాలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తుఫాన్ ముంచుకొస్తున్నందున ఇంధన శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించాలని మంత్రి కిమిడి కళావెంకటరావు సూచించారు. కాగా, తుఫాన్ సమయంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఇబ్బంది లేకుండా తగిన నిల్వలను సిద్ధంచేసి, వాటిని సురక్షిత గిడ్డంగుల్లో ఉంచాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కోస్తా జిల్లాలపై ప్రభావం చూపుతుందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది.