మస్కట్‌కు పంపిస్తానంటూ మహిళపై అత్యాచారం, ఆపై ..!

Tuesday, June 25, 2019 03:39 PM Crime
మస్కట్‌కు పంపిస్తానంటూ మహిళపై అత్యాచారం, ఆపై ..!

ఉపాధి కోసం మస్కట్‌కు పంపిస్తానంటూ ఓ మహిళను నమ్మించి ఆమెపైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి పశ్చిమగోదావరి జిల్లా, ఇరుగవరం మండలం, పెకేర్‌ గ్రామానికి చెందిన కోలి వెంకట నర్సింహమూర్తి (41) ఎలక్ట్రిషయన్‌గా పనిచేస్తున్నాడు. దుబాయ్‌, మస్కట్‌ ప్రాంతాలకు ఉపాధి కోసం నిరుద్యోగులను పంపించే ఏజెంట్‌గా అక్కడ ప్రజలని నమ్మబలికాడు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఓ మహిళ(35) తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, మస్కట్‌ వెళ్లాలని నిర్ణయించుకుని మూర్తిని సంప్రదించారు. దీంతో ఈనెల 18వ తేదీన ఆమెతో పాటు మరో మహిళను తీసుకుని మూర్తి మద్రాస్‌కు వెళ్లాడు. ప్లాన్ ప్రకారం అక్కడికి వారితో పాటు వచ్చిన మహిళకు విమాన టికెట్‌ దొరకలేదని వెనక్కి పంపించేశాడు.

మహిళ(35)తో కలిసి అదే ప్రాంతంలోని ఓ లాడ్జీలో ఉన్నారు. రెండు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఇమిగ్రేషన్‌కు తీసుకెళ్లి సరైన పత్రాలు లేకపోవడంతో మస్కట్‌కు వెళ్లడం కుదరడం లేదని, నగరానికి వచ్చి మరోసారి ప్రయత్నిద్దామని నమ్మించాడు. 22వ తేదీన రైలులో సికింద్రాబాద్‌కు తీసుకువచ్చాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెని బెదిరించాడు. మరసటి రోజూ అత్యాచారయత్నం చేయగా అతడి నుంచి తప్పించుకొని బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఆమె గడియ పెట్టుకుంది. అతడు అక్కడి నుంచి వెళ్లే వరకు వేచి ఉండి లాడ్జీ సిబ్బంది సహకారంతో బయటపడి 23వ తేదీ రాత్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కుపంపారు.

For All Tech Queries Please Click Here..!