హైదరాబాద్లో ఘోరం: విషాదం మిగిల్చిన ఇద్దరమ్మాయిల ప్రేమ
హాస్టల్ ఉంటున్న సమయంలో ఇద్దరమ్మాయిల మధ్య చిగురించిన ప్రేమ విషాదంగా ముగిసింది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్పై వినోద్కుమార్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం ఫిలింనగర్కు చెందిన శ్రీనివాస్ కుమార్తె శ్రీదేవి (22), రాజన్న సిరిసిల జిల్లా, ఎల్లారెడ్డిపేటకు చెందిన అంజయ్య కుమార్తె నమ్రత (22)లు హిమాయత్నగర్లోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్నారు. 2016 నుంచి 2018 డిసెంబర్ వరకు హిమాయత్నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఇద్దరు కలిసి ఉంటూ కాలేజీకి వెళ్లేవారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. గత ఐదు నెలల క్రితం నమ్రత హాస్టల్ ఖాళీ చేసి స్వగ్రామానికి వెళ్లడంతో వారు ఇద్దరు కలువలేని పరిస్థితి ఏర్పడింది. డిగ్రీ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో శనివారం పరీక్ష రాసేందుకు నమ్రత హైదరాబాద్కు వచ్చింది.
హైదర్గూడలోని ఓ కాలేజీలో నమ్రత పరీక్ష రాసేందుకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీదేవి పరీక్ష ముగిసిన తరువాత నమ్రత వద్దకు వచ్చి తనను ఎందుకు దూరం చేస్తున్నావ్ నిన్ను విడిచి ఉండటం తన వల్ల కావడం లేదని, తనతోనే ఉండాలని నమ్రతని కోరింది. ఈ విషయం కూర్చోని చర్చించుకుందామని శ్రీదేవి, నమ్రతతో పాటు వారి క్లాస్మేట్ సాయికుమార్తో కలిసి నారాయణగూడలోని మెల్కోటే పార్కు వద్దకు వచ్చి అక్కడ మాట్లాడుకుంటున్నారు. నమ్రత తాను నీతో ఉండలేను అని చెప్పడంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీదేవి వెంట తెచ్చుకున్న విషం తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో భయాందోళనకు గురైన నమ్రత, సాయికుమార్లు స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శ్రీదేవిని చిక్సిత నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదర్గూడలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా చిక్సిత పొందుతూ ఆదివారం మృతి చెందింది. శ్రీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్ప గించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పై వినోద్ తెలిపారు.