20 రోజుల్లో పెళ్లి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య..!
రైల్వే కోడూరులో దారుణ హత్య చోటుచేసుకుంది. కొన్ని రోజుల్లో వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. వివరాలలోకి వెళితే రైల్వే కోడూరులోని రంగనాయకుల పేటకు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్(26) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈనెల 23న తన మేనమామ కూతురితో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే బుధవారం రంజాన్ పండుగ సందర్భంగా రైల్వే కోడూరుకు వచ్చేందుకు ఖాదర్ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తెల్లవారు జామున శ్రీకృష్ణ సినిమా హాల్ దగ్గరికి రాగానే గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు.
సమాచారం అందుకున్న రైల్వే కోడూరు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా చేతికి అందివచ్చిన కొడుకు హత్యకు గురికావడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొన్నిరోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండటంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.