టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని పెప్పర్ స్ప్రేతో దాడి

Wednesday, January 15, 2020 02:00 PM Crime
టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని పెప్పర్ స్ప్రేతో దాడి

టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి పెప్పర్ స్ప్రే తో పెట్రోలింగ్ సిబ్బంది పై దాడి చేసిన దొంగల ముఠాను పోలీసులు చేధించారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారి వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు వర్ధన్‌ మనికందన్‌గా..అతనిది తమిళనాడుగా గుర్తించామన్నారు. ఘటన అనంతరం నిందితుడు వర్ధన్ మనికందన్ పరారయ్యాడని.. సీసీ ఫుటేజీ ద్వారా విచారణ చేపట్టగా  వర్ధన్ మనికందన్‌తో పాటు పిల్లా యాదయ్య, షేక్ సయ్యద్, ఉపేంద్ర చారీ, లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల‌ నుంచి 47.5 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి‌ ఆభరణాలు, 1ఎయిర్ పిస్తోల్, 2పెప్పర్ స్ర్పే బాటిల్స్, 3బైకులు, 3టీవీలు, 1పియానో, చోరీకి పాల్పడే వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

2017 నుంచి మనికందన్ గ్యాంగ్ చోరీలు చేస్తున్నారని, వీరిపై పలు పోలీస్‌ స్టేషన్లలో 27 కేసులున్నాయని వెల్లడించారు. ఉప్పల్, తుర్కపల్లి, ఎల్బీనగర్, మీర్ పేట్, వనస్థలి పురం, హయత్ నగర్ పీఎస్ లలో కేసులు ఉన్నాయన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన మల్లేష్ తో మనికందన్ గ్యాంగ్ చేతులు కలిపి గుప్తనిధుల కోసం కూడా తవ్వకాలు జరిపినట్లు సమాచారం ఉందని తెలిపారు. వీరిపై నల్గొండ జిల్లా దేవరకొండ పీఎస్‌లో కేసు నమోదైందని, నిందితుల గాలింపులో తమిళనాడు పోలీసులు చాలా సహకారం అందించారని పేర్కొన్నారు. అనంతరం ఈ కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులకు సీపీ రివార్డులు అందించారు.

For All Tech Queries Please Click Here..!