ముంబాయ్ లో డాక్టర్ల నిర్లక్ష్యం, పసికందుకు కరోనా..!
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ముంబైలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. డాక్టర్లు చేసిన ఒక పొరపాటు వలన ఓ మహిళ, తన మూడు నెలల శిశువు ఈ మహమ్మారి వైరస్ భారిన పడింది. వివరాలలోకి వెళితే ముంబైలోని చెంబూర్ శివారులో నివసిస్తున్న ఓ వ్యక్తి గతవారం గర్భవతి అయిన తన భార్యను స్థానిక ఆసుపత్రిలో చేర్పించాడు. అక్కడే ఆరోగ్యవంతమైన శిశువుకు ఆమె జన్మనిచ్చింది. కొన్నిరోజుల తర్వాత వారు ఉన్న గదిలోనే ఒక రోగిని జాయిన్ చేశారు. అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు పసికందు కుటుంభానికి చెప్పలేదు. దీంతో తన భార్య, మూడు రోజుల పసికందు కోవిడ్ -19 భారినపడ్టారని, తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ఠాక్రేలకు విజ్ఞప్తి చేశాడు పసికందు తండ్రి.
నన్ను, నా భార్య, శిశువుకు కరోనా పరీక్షలు చేయడానికి పదమూడు వేల రూపాయలు వసూలు చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో వాళ్లకేమైనా వైరస్ అంటుకుందేమోనని, నా భార్య, బిడ్డకు రోజువారి హెల్త్ చెకప్ కూడా నిర్వహించలేదు. ఫలితాలు వచ్చే వరకు అక్కడే ఉంటామని విన్నవించుకున్నా ఆసుపత్రి మూసివేస్తున్నట్లు చెప్పి మమ్మల్ని బలవంతంగా బయటికి గెంటేశారని సదరు వ్యక్తి వాపోయాడు. ఇప్పుడు కస్తూర్బా ఆస్పత్రిలో తన కుటుంబం చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు. తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని, ఇకనైనా తన భార్య, బిడ్డకు మెరుగైన చికిత్స అందించేలా చూడాలని మోదీకి విన్నవించుకుంటూ ఓ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు. తన కుటుంబాన్ని అపాయంలోకి నెట్టేసిన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. ఇక మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 300 దాటగా, మృతుల సంఖ్య 13కి చేరింది.